న్యూఢిల్లీ, 02 సెప్టెంబర్ (హి.స.)‘ఓటు చోరీ’ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తన ఆరోపణలను తీవ్రతరం చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి తమ పార్టీ త్వరలోనే హైడ్రోజన్ బాంబును పేల్చుతుందని ఆయన పేర్కొన్నారు. రాహుల్ వ్యాఖ్యలకు తాజాగా భాజపా కౌంటర్ ఇచ్చింది. ఈసందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేడా (Pawan Khera) అంశాన్ని కూడా ప్రస్తావించింది.
భాజపా ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ (Amit Malviya) ఎక్స్లో పోస్టు పెట్టారు. అందులో పవన్ఖేడాకు రెండు ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా ఆయన పంచుకున్నారు. ‘రాహుల్ ‘‘ఓటు చోరీ’’ అంటూ తెగ అరుస్తున్నారు. కానీ, ఆయన తల్లి సోనియాగాంధీ భారత పౌరసత్వం పొందకముందే.. ఆమె పేరు భారత ఓటర్ల జాబితాలో ఉన్న విషయాన్ని మర్చిపోతున్నారు. అంతేకాదు ఆ పార్టీ ప్రతినిధి పవన్ఖేడాకు రెండు ఎపిక్ నంబర్లు ఉన్నాయని తాజాగా బయటపడింది. ఆయనకు రెండు ఓట్లు ఎలా ఉన్నాయి. వీటిని ఉపయోగించి ఆయన అనేకసార్లు ఓటు వేయలేదా?. ఇది ఎన్నికల చట్టాలను ఉల్లంఘించడం కాదా?. దీనిపై ఎన్నికల కమిషన్ దర్యాప్తు చేయాలి. రెండు ఓట్లు కలిగిఉన్న ఆయన.. బిహార్లోని ప్రజలను తప్పుదారి పట్టించేలా ఓట్ల చోరీపై మాట్లాడటం విడ్డూరం. దేశంలోని ఎన్నికల ప్రక్రియను అణగదొక్కేందుకు విలేకరుల సమావేశాలు నిర్వహించారు’ అని విమర్శించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ