అమరావతి, 20 సెప్టెంబర్ (హి.స.)
రాజంపేట: అన్నమయ్య జిల్లా రాజంపేటలోని ఆర్టీసీ పెట్రోల్ బంక్లో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణ పూర్తయింది. రూ.62 లక్షల మేర అక్రమాలు జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధరించిన అధికారులు.. రాజంపేట డిపో మేనేజరు సహా ఆరుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఇప్పటికే 29 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
గత ఏడాది డిసెంబర్ 7న ఈ పెట్రోల్ బంకు ప్రారంభించారు. అప్పటి నుంచి రూ.62 లక్షల నిధులను సిబ్బంది స్వాహా చేశారు. సాంకేతిక లోపాలను ఆసరాగా తీసుకుని అక్రమాలకు పాల్పడ్డారని అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై రాయచోటి ఆర్టీసీ డీపీటీఓ రాము విచారణ చేపట్టి నిధులు గోల్మాల్ అయ్యాయని నిర్ధరించారు. దీంతో అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడిని కలిసి ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణ సీఐ నాగార్జున కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆర్టీసీ పెట్రోల్ బంకు నిర్వహణ అధికారులుగా పనిచేస్తున్న డిపో క్లర్క్ పీఆర్ నాయుడు, అసిస్టెంట్ డిపో క్లర్క్ పీఎల్ నర్సారెడ్డితోపాటు బంకులో పనిచేస్తున్న మరో 27 మందిపై గతంలో పోలీసులు కేసు నమోదు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ