అమరావతి, 20 సెప్టెంబర్ (హి.స.)
మద్యం కుంభకోణం కేసులో నిందితుడైన వైకాపా ఎంపీ మిథున్రెడ్డి (ఏ-4)ని రెండో రోజు సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి ఆయనను విజయవాడకు తరలించారు. సాయంత్రం విచారణ అనంతరం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించనున్నారు.
ఇక మిథున్రెడ్డి తొలిరోజు విచారణ 4 గంటల్లోనే ముగిసింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. మిథున్రెడ్డిని రెండు రోజుల కస్టడీకి తీసుకున్న సిట్ అధికారులు తొలిరోజైన శుక్రవారం 50కి పైగా ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ఆయన ఏ ఒక్కదానికీ సరైన సమాధానాలు చెప్పలేదని తెలిసింది. మిథున్రెడ్డి కుటుంబీకులకు చెందిన పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ఖాతాల్లోకి మద్యం ముడుపుల సొమ్ము రూ.5కోట్లు జమకావడంపై ప్రధానంగా ప్రశ్నించినట్లు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ