న్యూఢిల్లీ,22,సెప్టెంబర్ (హి.స.)అంతర్జాతీయ సరిహద్దు వద్ద తాజాగా జరిగిన ఓ సంఘటన మరోసారి భద్రతా ఆందోళనలను రేకెత్తించింది. జమ్మూ జిల్లాలో ఆర్ఎస్ పురా సెక్టార్లో శనివారం సాయంత్రం 7 గంటల సమయంలో ఒక అనుమానాస్పద పాకిస్తాన్ డ్రోన్ (Pakistan Drone Activity) భారత భూభాగంలో కనిపించినట్లు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) గుర్తించింది.
ఈ క్రమంలో ఆయుధాలు లేదా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా జరిగే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై అప్రమత్తమైన బీఎస్ఎఫ్ అధికారులు వెంటనే సెర్చ్ ఆపరేషన్ను ప్రారంభించారు.
ఈ డ్రోన్ గుర్తించిన వెంటనే, బీఎస్ఎఫ్ బృందాలు ఆర్ఎస్ పురా సమీపంలోని ఒక గ్రామం వద్ద తనిఖీలు చేపట్టాయి. డ్రోన్ ద్వారా ఆయుధాలు, మాదక ద్రవ్యాలు లేదా ఇతర నిషిద్ధ వస్తువులు డ్రాప్ చేయబడి ఉండవచ్చనే అనుమానంతో ఈ ఆపరేషన్ను నిర్వహిస్తున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ డ్రోన్ భారత భూభాగంలో కొంత సమయం గాల్లో తిరిగినట్లు గుర్తించారు. ఈ సంఘటనతో సరిహద్దు భద్రతపై మరింత అప్రమత్తత అవసరమని అధికారులు భావిస్తున్నారు.
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు