ముంబయి,22, సెప్టెంబర్(హి.స.) దేశీయ మార్కెట్లు ఈ వారాన్ని నష్టాల్లో ప్రారంభించాయి (Stock Market Open Today). అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు కొనసాగుతున్నప్పటికీ.. మన సూచీలు మాత్రం నష్టాల్లో ఉన్నాయి. నూతన హెచ్1బీ వీసా దరఖాస్తులపై లక్ష డాలర్ల (సుమారు రూ.88 లక్షల)ను ఐటీ కంపెనీలు చెల్లించాలని అమెరికా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో.. ఐటీ షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. ఉదయం 9.31 గంటల సమయంలో సెన్సెక్స్ 149 పాయింట్ల నష్టంతో 82,476 వద్ద కదలాడుతోంది. నిఫ్టీ 30 పాయింట్లు క్షీణించి 25,296 వద్ద ట్రేడవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 88.20గా ఉంది.
నిఫ్టీ సూచీలో హీరో మోటోకార్ప్ లిమిటెడ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ట్రెంట్, ఆసియన్ పెయింట్స్, టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. టెక్ మహీంద్రా, టీసీఎస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అపోలో హాస్పిటల్స్, లార్సెన్ స్టాక్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు