అమరావతి, 27 సెప్టెంబర్ (హి.స.)
కలెక్టరేట్, బలగ, (శ్రీకాకుళం), బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావం జిల్లాపై పడనుంది. రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ జిల్లా అధికారులతో శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. నాగావళి, వంశధార నదుల్లో ప్రవాహం పెరిగితే పరివాహక ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని స్పష్టం చేశారు. కాజ్వేలపై వరద పారితే వాహనాలను అనుమతించకూడదని ఆదేశించారు. 29వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉండటంతో చెట్ల కింద ఎవరూ ఉండొద్దని సూచించారు. కాలువలు, చెరువు గట్లు బలహీనంగా ఉంటే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ