మాచర్ల, 28 సెప్టెంబర్ (హి.స.)
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిపోలీసుల విచారణకు హాజరయ్యారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడులో జరిగిన జవిశెట్టి సోదరుల జంట హత్య కేసులో వీరు ఏ6, ఏ7 నిందితులు. శనివారం మాచర్ల సర్కిల్ కార్యాలయానికి హైకోర్టు న్యాయవాదులు మనోహర్రెడ్డి, రామలక్ష్మణారెడ్డిలతో వీరు హాజరయ్యారు. గురజాల డీఎస్పీ జగదీశ్, మాచర్ల రూరల్ సీఐ నఫీజ్ బాషా వీరిని విచారించారు. ముందుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఉదయం 10.45 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు సుమారు 170 ప్రశ్నలు సంధించగా.. ‘తెలియదు.. గుర్తు లేదు..’ అనే సమాధానాలు వచ్చినట్టు సమాచారం. సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిని సుమారు 180 ప్రశ్నలు అడగ్గా.. ఆయన కూడా ‘తెలియదు.. గుర్తులేదు.. నాకు సంబంధం లేదు’ అనే సమాధానాలు ఇచ్చినట్టు తెలిసింది. వీరు నిందితులతో మాట్లాడినట్లు తెలియజేసే ఫోన్ కాల్స్, సిగ్నల్స్ను విచారణాధికారులు ప్రస్తావించగా.. ‘ఆ ఫోన్లు మేం వాడలేదు.. ఎవరు వాడారో మాకు తెలియదు’ అంటూ సమాధానాలిచ్చారని సమాచారం. విచారణ అనంతరం వీరిద్దరినీ పోలీసులు బయటికి పంపించేశారు. మరోసారి వీరిని విచారణకు పిలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ