అమరావతి, 28 సెప్టెంబర్ (హి.స.)టీవీకే పార్టీ అధ్యక్షుడు దళపతి విజయ్(Thalapathy Vijay) సభలో తీవ్ర తొక్కిసలాట జరిగి 33 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో పార్టీ కార్యకర్తలతోపాటు ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నారు. తాజాగా ఈ ఘటనపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్పందించారు.
ఈ మేరకు నెట్టింట ప్రకటన విడుదల చేశారు.
‘‘టీవీకే ప్రెసిడెంట్ విజయ్ చేపట్టిన ర్యాలీలో తొక్కిసలాట జరగడం దురదృష్టకరం. ప్రాథమిక సమాచారం మేరకు ఈ దుర్ఘటనలో 33 మంది మరణించారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యాను. మృతుల్లో ఆరుగురు చిన్నారులు ఉండటం ఆవేదన కలిగించింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరుతున్నాను’’ అని ప్రకటనలో పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి