అమరావతి, 29 సెప్టెంబర్ (హి.స.)ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ రిలీఫ్ లభించింది. ఆయనకు బెయిల్ మంజూరైంది. విజయవాడ ఏసీబీ కోర్టు ఆయన షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వారంలో రెండుసార్లు సిట్ విచారణకు హాజరవ్వడంతో పాటు రెండు ష్యూరిటీలు, రూ.2 లక్షల పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
కాగా.. మూడు వారాల క్రితం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఆరురోజులపాటు మధ్యంతర బెయిల్ పొందిన ఆయన సెప్టెంబర్ 11న తిరిగి ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. అనంతరం సిట్ అధికారులు ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. మద్యం కుంభకోణం విచారణలో పొంతనలేని సమాధానాలు చెప్పడం, విచారణకు సహకరించకపోవడంతో మిథున్ రెడ్డిని జులై 19న అరెస్ట్ చేశారు. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు మొదటి నుంచీ ఆయనకు జైల్లో అన్నిరకాల వసతులు కల్పించారు. ఈ కేసులో ఇప్పటికే ఏ31 ధనుంజయ రెడ్డి, ఏ 32 కృష్ణమోహన్ రెడ్డి, ఏ-33 బాలాజీ గోవిందప్పలు బెయిల్ పొందిన విషయం తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి