అమరావతి, 30 సెప్టెంబర్ (హి.స.)
సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా విద్యుత్తు చార్జీలను తగ్గించామని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి అన్నారు. విద్యుత్తు చార్జీల తగ్గింపు ప్రకటనను కౌన్సిల్ సమావేశంలోనే చేయాలనుకున్నామని, కానీ ప్రతిపక్షం కాఫీ, టీ కోసం గోల చేయడంతో చేయలేకపోయామన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ‘‘విద్యుత్తు చార్జీల తగ్గింపుతో తాడేపల్లికి షాక్ తగిలింది. గత వైసీపీ పాలకులు విద్యుత్తు వ్యవస్థను పూర్తిగా దెబ్బతీశారు. పీపీఏలను రద్దుచేసి కమిషన్ల కోసం అనేక అక్రమాలు చేశారు. హిందూజా వంటి సంస్థలకు ప్రయోజనం కలిగించేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ట్రాన్స్ఫార్మర్లు, మీటర్లు, ఇతర పరికరాలపై అధిక ధరలు విధించడంతో విద్యుత్తు రంగం తీవ్ర సంక్షోభానికి గురైంది. సీఎం చంద్రబాబు నాయకత్వంలో విద్యుత్తు రంగాన్ని తిరిగి పటిష్ఠం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇచ్చిన హామీ ప్రకారం యూనిట్కు 13 పైసలు మేర తగ్గించిన విద్యుత్తు చార్జీలను నవంబరు 1 నుంచి అమలు చేస్తాం. వైసీపీ పాలనలో ప్రజల కేవలం ట్రూఅప్ అనే పదాన్ని మాత్రమే విన్నారు. కూటమి ప్రభుత్వం కొత్తగా ట్రూడౌన్ అనే పదాన్ని పరిచయం చేస్తోంది. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు, నాసిరకం బొగ్గు సరఫరా, అధిక ధరలతో విద్యుత్తు కొనుగోలు చేయడం వంటి చర్యల వల్ల రాష్ట్ర విద్యుత్తు వ్యవస్థ భారీగా ఆర్థిక నష్టాలను చవిచూసింది. కూటమి ప్రభుత్వం చార్జీల తగ్గింపుతో పాటు బార్బర్ సెలూన్లు, చేనేత వర్కింగ్ షెడ్లు, ఆక్వా రైతులకు సబ్సిడీతో విద్యుత్తు అందిస్తోంది’’ అని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ