దిల్లీ: 30 సెప్టెంబర్ (హి.స.)హెచ్-1బీ వీసా (H-1B Visa Fee)ల విషయంలో అమెరికా కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇటీవల వాటి ఫీజును 215 డాలర్ల నుంచి లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అమెరికా వాణిజ్య మంత్రి హొవార్డ్ లుట్నిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2026 ఫిబ్రవరికి ముందే ఆ వీసాల జారీ ప్రక్రియలో గణనీయమైన మార్పులు ఉంటాయని వెల్లడించారు. పాత విధానంలో లోపాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.
ఇటీవల ట్రంప్ ప్రకటించిన వీసా ఫీజు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. హెచ్-1బీ వీసా (H-1B Visa)పై విధించిన లక్ష డాలర్ల రుసుము వార్షిక ఫీజు కాదని, దరఖాస్తు చేసుకొనే సమయంలో కట్టాల్సిన వన్టైమ్ ఫీజు మాత్రమేనని వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ స్పష్టత ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ వన్టైమ్ లక్ష డాలర్ల రుసుము ఇకపై కొత్తగా హెచ్-1బీ వీసాకు దరఖాస్తు చేసుకునేవారికే అమలుచేస్తామని, ప్రస్తుత వీసాదారులకు, రెన్యూవల్కు వర్తించదని చెప్పారు. దీనిని ఉద్దేశించి వాణిజ్య మంత్రి మాట్లాడారు. ‘‘2026 నుంచి ఈ ప్రక్రియ అంతా అమల్లోకి వస్తుంది. నా అంచనా ప్రకారం ఇప్పుడు.. 2026లో గణనీయమైన మార్పులు ఉంటాయి’’ అని పేర్కొన్నారు. లక్ష డాలర్ల ఫీజు కారణంగా రానున్న రోజుల్లో ఆ వీసాపై వచ్చే వారి సంఖ్యలో మార్పు ఉంటుందని అంచనా వేశారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ