విశాఖపట్నం:, 8 సెప్టెంబర్ (హి.స.)
విశాఖపట్నంలోని ఈస్టిండియా పెట్రో కెమికల్స్(ఈఐపీఎల్)లో ఆదివారం మధ్యాహ్నం పిడుగుపడి మంటలు ఏర్పడిన ట్యాంకర్ పై భాగంలో తాజాగా మరోసారి మంటలు చెలరేగాయి. ఇథనాల్ ట్యాంకర్ పైభాగంలో పెద్ద ఎత్తున మంటలు అలముకున్నాయి. పక్కనే ఉన్న ట్యాంక్లకు మంటలు అంటుకునే అవకాశం ఉన్న తరుణంలో పోర్ట్ అధికారులు ఇండియన్ నేవీ సహకారం కోరారు. నేవీ హెలికాప్టర్ల సాయంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఆదివారం మధ్యాహ్నం భారీవర్షం కురవగా 7,500 టన్నుల సామర్థ్యం గల పెట్రోల్ ట్యాంక్పై పిడుగు పడింది. దీంతో పైకప్పు పడిపోయి మంటలు చెలరేగాయి. అధికారులు 10 అగ్నిమాపక శకటాలను తీసుకొచ్చి మంటలను అదుపు చేశారు. తాజాగా మరోసారి మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ