
ఢిల్లీ,12 జనవరి (హి.స.)దాయాది దేశం పాకిస్థాన్ మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. జమ్మూ కాశ్మీర్లో నియంత్రణ రేఖ సమీపంలో బహుళ డ్రోన్ చొరబాటు ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. రాజౌరిలోని ఎల్ఓసీ వెంట నౌషెరా సెక్టార్ను కాపలా కాస్తున్న ఆర్మీ దళాలు… గనియా-కల్సియన్ గ్రామంపై డ్రోన్ కదలికను గమనించి వెంటనే లైట్ మెషిన్ గన్లతో కాల్పులు జరిపారు.
జమ్మూ కాశ్మీర్లోని సాంబా, రాజౌరి, పూంచ్ జిల్లాల్లోని అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ), నియంత్రణ రేఖ (ఎల్ఓసి) వెంబడి అనేక ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం భద్రతా దళాలు అనుమానిత డ్రోన్ల కదలికను గుర్తించాయని అధికారులు తెలిపారు. ఎగిరే వస్తువులన్నీ పాకిస్తాన్ వైపు నుంచి వచ్చాయని.. కొన్ని నిమిషాలు భారత భూభాగంపై సంచరించాయని వెల్లడించారు. అనుమానిత డ్రోన్ కార్యకలాపాలను గమనించిన వెంటనే భద్రతా దళాలు ఆపరేషన్ ప్రారంభించాయని చెప్పారు.
రాజౌరిలోని నియంత్రణ రేఖ వెంబడి నౌషెరా సెక్టార్ను కాపలా కాస్తున్న సైనిక దళాలు తొలుత సాయంత్రం 6.35 గంటల ప్రాంతంలో గనియా-కల్సియన్ గ్రామంపై డ్రోన్ కదలికను గమనించగానే మీడియం, లైట్ మెషిన్ గన్ల నుంచి కాల్పులు జరిపారని పేర్కొన్నారు. సాయంత్రం 6.35 గంటలకు రాజౌరి జిల్లాలోని టెర్యాత్లోని ఖబ్బర్ గ్రామంలో మరో డ్రోన్ కనిపించిందని.. మెరిసే కాంతితో ఎగిరే వస్తువు కలకోట్లోని ధర్మసల్ గ్రామం వైపు నుంచి వచ్చి భరఖ్ వైపు కదిలిందని అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ