
తిరుపతి, 19 జనవరి (హి.స.):రాష్ట్రంలో నకిలీ వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య మండలి చైర్మన్ డాక్టర్ దగ్గుబాటి శ్రీహరిరావు హెచ్చరించారు. సొంత వైద్యంతో ప్రజలను మోసం చేసి వ్యాపారం చేయాలంటే ఇక కుదరదన్నారు. తిరుపతిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనకు రాష్ట్ర స్థాయి పదవి ఇచ్చిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో అందరి సహకారంతో విజయవాడలో జాతీయ స్థాయి, విశాఖలో అంతర్జాతీయ స్థాయి వైద్యుల సదస్సు నిర్వహించడానికి కార్యాచరణ తయారు చేస్తామన్నారు.
వైద్యులు సందేహాలను నివృత్తి చేసుకునేలా దేశంలోనే మొదటి సారిగా వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించామని తెలిపారు. రానున్న రోజుల్లో వైద్యులు వైద్య మండలి వద్దకు రాకుండా వారి సంతకం, బొటనవేలు ముద్ర, కంటి ఐరిస్ గుర్తించడం ద్వారా వారు నేరుగా అన్ని సౌకర్యాలు ఆన్లైన్లో పొందే అవకాశాలు కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ