
హైదరాబాద్, 05 జనవరి (హి.స.) జనసేన పార్టీకి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర కమిటీలను రద్దు చేశారు.. వాటి స్థానంలో అడ్ హాక్ కమిటీలను నియమించారు. రాష్ట్రంలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. GHMC, వీరమహిళ, యువజన, విద్యార్థి విభాగ కమిటీలను రద్దు చేసి, కొంతమంది సభ్యులతో తాత్కాలికంగా అడ్ హాక్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ అడ్ హాక్ కమిటీలు 30 రోజుల పాటు పనిచేయనున్నాయి. ప్రతి నియోజకవర్గం, GHMC పరిధిలోని 300 వార్డుల్లో పర్యటించి కనీసం ఐదుగురు సభ్యులతో జాబితాలను సిద్ధం చేసి పార్టీ కార్యాలయానికి అందజేయనున్నారు. త్వరలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేలా నూతన కమిటీలను ప్రకటించనున్నట్టు తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు