
భీమవరం 25 ఫిబ్రవరి (హి.స.): ఓ సామిల్లు యజమాని నుంచి రూ.4 లక్షలు లంచంగా తీసుకుంటున్న నరసాపురం అటవీ శాఖ సెక్షన్ అధికారి (ఎఫ్ఎస్వో) ఎస్.సురేష్కుమార్ను అనిశా అధికారులు పట్టుకున్నారు. భీమవరం హౌసింగ్బోర్డు కాలనీలో ఇంట్లోనే అతన్ని పట్టుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు. అనిశా డీఎస్పీ జి.వి.కృష్ణారావు, సీఐలు ఎం.బాలకృష్ణ, కె.శ్రీనివాసు, సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నారు. ఇంట్లో, కార్యాలయాల్లో అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
దస్త్రం దాచి పెట్టి..కొన్ని రోజుల కిందటే మిల్లు వివరాలను అటవీ అధికారులు తీసుకున్నట్లు తెలుస్తుంది. అప్పట్నుంచి దస్త్రం దాచిపెట్టి నగదుకు డిమాండ్ చేస్తున్నట్లు ప్రస్తుతం పట్టుబడిన తీరును బట్టి వెల్లడవుతుంది. రూ.6 లక్షలు డిమాండ్ చేయగా విసుగుచెందిన బాధితుడు అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించినట్లు సమాచారం. మంగళవారం ఉదయం అనిశా అధికారులు భీమవరం చేరుకున్నారు. భీమవరం ఇన్ఛార్జిగా ఉన్న ఎఫ్ఎస్వో సురేష్కుమార్ నగదును బాధితుడి నుంచి తీసుకుంటుండగా నేరుగా పట్టుకున్నారు.
..అటవీ అధికారి ఒకరు అనిశా అధికారులకు పట్టుబడ్డారన్న సమాచారంతో పలువురు ఉలిక్కిపడ్డారు. తీగ లాగితే డొంక కదులుతుందేమోనని అటవీ అధికారులు ఆందోళన చెందారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరి పాత్ర అయినా ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలు తీసుకున్న తర్వాత కొన్ని రోజులపాటు దస్త్రం బహిర్గతం కాకుండా ఉంచడం వెనుక ఇంకెవరిదైనా హస్తం ఉందా అనేది విచారణలో తేలాల్సి ఉందనే వార్తలు గుప్పుమంటున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ