
ఢిల్లీ,25 ,ఫిబ్రవరి (హి.స.)జాతీయ రహదారుల నిర్మాణం, పర్యవేక్షణలో ఏఐని వాడుతున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రహదారుల నిర్మాణానికి సంబంధించిన సవివర ప్రాజెక్టు నివేదికల (డీపీఆర్) తయారీకి, ఆక్రమణల గుర్తింపునకు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాలను ముందే గుర్తించడానికి ఏఐ, ఉపగ్రహ చిత్రాలను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంద్వారా రోడ్డు భద్రతను మెరుగుపరచడం, ప్రమాదాలను తగ్గించడం, నాణ్యతను మెరుగుపరచడం, జాప్యాన్ని నివారించడం వంటివి చేపట్టినట్లు వెల్లడించారు. దిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న రెండు రోజుల బిజినెస్ స్టాండర్డ్ మంథన్-2026 సదస్సులో భాగంగా తొలిరోజైన మంగళవారం ఆయన మాట్లాడారు. ఏఐ ఆధారిత మౌలిక వసతులు, ప్రత్యామ్నాయ ఇంధనాలు, రవాణా ఖర్చులు తగ్గడం, రోడ్డు భద్రత సంస్కరణలు వంటివి భారత్ దీర్ఘకాల వృద్ధికి దోహదపడతాయని వివరించారు. విద్యుత్ వాహనాల విషయంలో భారత్ అత్యధిక వృద్ధి రేటును సాధిస్తోందని గడ్కరీ చెప్పారు. ఈవీల విక్రయాల్లో 30-40 శాతం పెరుగుదల ఉందని తెలిపారు. కిలో హైడ్రోజన్ ధర 1 డాలర్కు రావాలన్నది తన కలని పేర్కొన్నారు. వాహనాలు పరస్పరం ఢీ కొట్టుకునే ప్రమాదాన్ని ఏఐ సాయంతో గుర్తించి, బ్రేక్లు వేసే విధానాన్ని తెచ్చే అంశంపై ఐటీ మంత్రిత్వశాఖతో మాట్లాడున్నట్లు వెల్లడించారు.
5
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ