
హైదరాబాద్, 26 ఫిబ్రవరి (హి.స.)కేరళ స్టోరీ-2 సినిమా విడుదలపై కేరళ హైకోర్టు స్టే విధించింది. శుక్రవారం విడుదల కావాల్సిన కేరళ స్టోరీ-2 సినిమాను నిలిపివేసింది. సెన్సార్ బోర్డు తీరుపై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమాలో వివాదాస్పద అంశాలు ఉన్నాయని, సినిమా సరిగ్గా చూడకుండానే అనుమతి ఎలా ఇచ్చారంటూ సెన్సార్ బోర్డుపై కోర్టు మండిపడింది. ఫిర్యాదులను సెన్సార్ బోర్డు పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించింది. పిటిషనర్లు ఇంటీరియమ్ అప్లికేషన్ ద్వారా అదనపు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడానికి అవకాశం కల్పించింది.
30 నిమిషాలకు పైగా వాదోపవాదాలు నడిచాయి. అనంతరం కోర్టు విచారణను వాయిదా వేసింది. సినిమాను మరింత క్షణ్ణంగా రివ్యూ చేసి, బ్యాన్ పిటిషన్లపై నిర్ణయం తీసుకోనుంది. కాగా, సెన్సార్ బోర్డు 16 కోతలతో సినిమాకు U/A 16+ సర్టిఫికెట్ ఇచ్చింది. అభ్యంతరకర సన్నివేశాల నిడివిని తగ్గించి, పలు డైలాగ్స్లో మార్పులు చేయాలని సూచించింది. సినిమా మొదట్లో వచ్చే డిస్క్లైమర్ను కొన్ని నిమిషాల పాటు వాయిస్ ఓవర్తో కొనసాగించాలని ఆదేశించింది. సినిమాలో నటించిన మైనర్లకు సంబంధించి కన్సెంట్ వెరిఫికేషన్, డాక్యుమెంట్స్ ఇవ్వాలని సినిమా నిర్మాతలను సెన్సార్ బోర్డు కోరింది.
సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ‘ది కేరళ స్టోరీ’ 2023లో విడుదలైంది. ఆదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఎలాంటి అంచనాలూ లేకుండా మే 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి.. ఘన విజయాన్ని సాధించింది. రూ. 20 కోట్లు పెట్టి తీస్తే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు కొనసాగింపుగా ‘ది కేరళ స్టోరీ 2’ తెరకెక్కింది. సీక్వెల్కు కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించారు. ఉల్కా గుప్త, అతిథి భాటియా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 27వ తేదీన విడుదల కానుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్