
శబరిమల, 27 ఫిబ్రవరి (హి.స.)
ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి
(Sabarimala) ఆలయంలో 2017లో కొత్త ధ్వజస్తంభం ఏర్పాటుకు సంబంధించి జరిగిన నిధుల గోల్మాల్ కేసు విచారణ వేగవంతమైంది. ఈ కేసులో భాగంగా మలయాళ సినీనటులు మోహన్లాల్ (Mohanlal), దిలీప్ (Dileep)లను విజిలెన్స్ అధికారులు ఇవాళ విచారించి వారి స్టేట్మెంట్లను నమోదు చేశారు. కాగా, 2017లో శబరిమల ఆలయంలో ప్రతిష్టించిన కొత్త ధ్వజస్తంభం తయారీలో బంగారం, నగదు దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలపై విజిలెన్స్ అండ్ యాంటి కరెప్షన్ బ్యూరో (VACB) దర్యాప్తు చేస్తోంది.
కాగా, ఆయలన ఆవరణలో ధ్వజస్తంభం ఏర్పాటు కోసం అప్పట్లో పలువురు ప్రముఖులు విరాళాలు అందజేశారు. ఈ క్రమంలో విరాళాల సేకరణ, ఖర్చులకు సంబంధించిన వివరాలను సేకరించేందుకు అధికారులు వారిని సంప్రదించారు. ధ్వజస్తంభం పూత కోసం ఉపయోగించిన బంగారం పరిమాణంలో తేడాలు ఉన్నట్లుగా ఆరోపణలు రావడంతో, అధికారులు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కేవలం సమాచార సేకరణలో భాగంగానే వీరి స్టేట్మెంట్లను రికార్డ్ చేశామని, మొత్తం బంగారం, నగదు దుర్వినియోగంపై లోతైన దర్యాప్తు కొనసాగుతోందని విజిలెన్స్ అండ్ యాంటి కరెప్షన్ బ్యూరో అధికారులు స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..