ఆ ఫ్లైఓవర్ నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం: సీపీ సజ్జనార్
హెచ్ - సిటీలో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఏడు ఫ్లైఓవర్లు, ఏడు అండర్ పాసుల నిర్మాణం జరుగుతోందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ రోజు ఆ పనులు మొదలయ్యాయని పేర్కొన్నారు
CP Hyderabad


హైదరాబాద్, 27 ఫిబ్రవరి (హి.స.)బంజారాహిల్స్ రోడ్ నెంబర్-2లో పార్క్ హయత్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఫ్లై ఓవర్ నిర్మాణ పనులని మేఘా నిర్మాణ సంస్థ ప్రారంభించింది. ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు ప్రారంభమైన ప్రాంతాన్ని హైదరాబాద్ సీపీ సజ్జనార్ (Hyderabad CP Sajjanar) పరిశీలించారు. సీపీ సజ్జనార్తో పాటు ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ నిర్మాణ సంస్థ ప్రతినిధులు పరిశీలించారు. ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ప్రారంభమైన సందర్భంగా ఈరోజు(శుక్రవారం) నుంచి పలుమార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మీడియాతో మాట్లాడారు. H-CITIలో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఏడు ఫ్లైఓవర్లు, ఏడు అండర్ పాసుల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. ఈ రోజు పనులు మొదలయ్యాయని పేర్కొన్నారు.

ఇవాళ నుంచి నిర్మాణ పనుల కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సీపీ సజ్జనార్ చెప్పుకొచ్చారు. ఇప్పటికే వాహనదారులకు పలు సూచనలు చేశామని అన్నారు. రెండు సంవత్సరాల్లో నిర్మాణ పనులు పూర్తి చేయాలని ప్లాన్ చేశామని తెలిపారు. నిర్మాణ సమయంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్లాన్ చేశామని చెప్పుకొచ్చారు. ఫ్లైఓవర్ నిర్మాణ సమయంలో ప్రజలు సహకరించాలని కోరారు. వివిధ ప్రాంతాల్లో నిర్మాణ పనులు దశల వారీగా జరుగుతాయని వెల్లడించారు. రాత్రి వేళ ఎక్కువగా పనులు చేయాలని నిర్మాణ సంస్థలను కోరామని అన్నారు. బేస్మెంట్ పూర్తి అయితే తర్వాత ట్రాఫిక్ ఆంక్షలు సవరించే అవకాశం ఉంటుందని తెలిపారు. 7 అండర్ పాసులు, 7 ఫ్లై ఓవర్లు అందుబాటులోకి వస్తే ఆయా రోడ్లు సిగ్నల్ ఫ్రీగా మారుతాయని హైదరాబాద్ సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.

అండర్ పాసుల నిర్మాణం ప్రారంభం: జోయల్ డేవిస్

H-Citiలో భాగంగా ఇవాళ నుంచి కేబీఆర్ పార్కు చుట్టూ 7 ఫ్లై ఓవర్లు, ఏడు అండర్ పాసుల నిర్మాణం ప్రారంభమైందని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ తెలిపారు. ఈ సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో జోయల్ డేవిస్ మాట్లాడారు. ఇవాళ(శుక్రవారం) నుంచి ఈ పనులు మొదలయ్యాయని వివరించారు. నిర్మాణ పనులను దృష్టిలో ఉంచుకొని వాహనదారులకు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశామని అన్నారు.

పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వైపు వెళ్లే వాహనాలు శ్రీనగర్ కాలనీ, ఇంద్రానగర్ బస్తీ మీదుగా జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వెళ్లాలని జోయల్ డేవిస్ సూచించారు. మాసబ్ ట్యాంక్ నుంచి కేబీఆర్ పార్కు మీదుగా జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వెళ్లే వాహనాలు రోడ్ నెంబర్- 45 మీదుగా వెళ్లాలని అన్నారు. రెండున్నర నెలలపాటు బంజరాహిల్స్ రోడ్ నెంబర్-2లో పిల్లర్స్ పనులు కొనసాగుతాయిని వివరించారు. రెండున్నర నెలలపాటు కొంత ట్రాఫిక్ సమస్య ఉంటుందని.. పరిస్థితులను బట్టి ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని వెల్లడించారు. పీక్ అవర్స్లో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని తెలిపారు. నిర్మాణ పనులు ప్రారంభమైనందున వాహనదారులు పోలీసులకు సహకరించాలని జోయల్ డేవిస్ కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande