
నిజామాబాద్, 23 మార్చి (హి.స.)
పదవ తరగతి పరీక్షా కేంద్రాలను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని మానిక్ భవన్ పాఠశాలతో పాటు నలంద హైస్కూల్ ఎగ్జామ్ సెంటర్లను సందర్శించి పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు, సిబ్బంది హాజరు గురించి ఆరా తీశారు. నిబంధనలకు అనుగుణంగానే నిర్ణీత సమయంలో ప్రశ్న పత్రాలను తెరిచారా? అని ఆరా తీశారు. తప్పనిసరిగా సి.సి కెమెరా రికార్డింగ్ నడుమ ప్రశ్న పత్రాల బండిల్ సీళ్లు తెరవాలని సూచించారు. ఈ మేరకు నిబంధనలు పాటించారా లేదా అని సి.సి ఫుటేజీల పరిశీలన ద్వారా నిర్ధారణ చేసుకున్నారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీటి వసతి, ఆరోగ్య కార్యకర్త అందుబాటులో ఉన్నారా లేదా అని గమనించారు. ఎగ్జామ్ హాల్లోకి సిబ్బంది ఎవరైనా సెల్ ఫోన్లతో వచ్చారా అని కలెక్టర్ నిశిత పరిశీలన చేశారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సజావుగా పరీక్షలు జరిపించాలని సూచించారు. ఎక్కడ కూడా కాపీయింగ్కు ఆస్కారం ఉండకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, కాపీయింగ్కు ఆస్కారం కల్పిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు. పరీక్షలు ముగిసేంత వరకు అప్రమత్తతతో పకడ్బందీగా విధులు నిర్వహించాలని సూచించారు. ప్రశ్న పత్రాలను తప్పనిసరిగా తగిన పోలీసు బందోబస్తు మధ్య కేంద్రాలకు తరలించాలని, ఎలాంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా పూర్తి పారదర్శకంగా, పక్కాగా పరీక్షలు జరిపించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు జె.శంకర్, టి.శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు