
చిత్తూరు 24 మార్చి (హి.స.) జిల్లా కేంద్రంలోని ఉమ్మడి చిత్తూరు జిల్లా కోర్టుకు మళ్లీ బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. సంబంధిత అధికారులు సోమవారం ఉదయం 11.30 గంటలకు గమనించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. తక్షణమే పోలీసు అధికారులు, పోలీసులు కోర్టు వద్దకు చేరుకుని.. చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక న్యాయమూర్తులు, కోర్టు అధికారులను అప్రమత్తం చేశారు.
న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు ఉద్యోగులు, సిబ్బంది, కక్షిదారులు కోర్టు భవనాల సముదాయం నుంచి బయటకు పంపి.. డీఎస్పీ సాయినాథ్, ఒకటో పట్టణ సీఐ మహేశ్వర్ పర్యవేక్షణలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో సముదాయంలోని అన్నీ కోర్టుల్లో తనిఖీలు చేపట్టారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని పోలీసులు నిర్ధారించారు. అనంతరం మధ్యాహ్నం నుంచి కోర్టుల నిర్వహణ యథావిధిగా కొనసాగాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ