
కడప, 25 మార్చి (హి.స.)వైసీపీ జోలికి వెళ్లాల్సిన అవసరం తనకు లేదని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి వెల్లడించారు. కానీ తనపై విమర్శలు చేస్తే తాను కూడా స్పందించాల్సి వస్తుందని తెలిపారు. తన లక్ష్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదని, అయితే వైసీపీ నేతల వ్యాఖ్యల వల్ల తరచూ వివరణ ఇవ్వాల్సి వస్తోందని అన్నారు. తాను ఎవరినీ కుక్కలతో పోల్చలేదని షర్మిల స్పష్టం చేశారు.
విజయమ్మ లేఖ వచ్చిన తరువాత కూడా తమపై విమర్శలు కొనసాగుతుండటంతోనే మొరగడం కుక్కల నైజం అన్నానని వివరించారు. ఈ క్రమంలోనే ఎన్నికల ముందు ప్రచారం కోసం మాత్రమే పులివెందులలో అరటి ప్రాసెసింగ్ యూనిట్ను జగన్ ప్రారంభించారని విమర్శలు చేశారు.
అరటి రైతుల సమస్యలపై కూడా షర్మిల స్పందించారు. కోల్డ్ స్టోరేజీ సౌకర్యాల విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నానని తెలిపారు. అరటి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వైఎస్ షర్మిల కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్