
మార్కాపురం 01 ఏప్రిల్ (హి.స.)
, మార్కాపురం బస్సు ప్రమాదం కేసులో డ్రైవర్ యువరాజు, బస్సు యజమాని హరికృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘోర ప్రమాదంలో 14 మంది ప్రయాణికులు సజీవ దహనమవగా.. మరో 28 మంది గాయపడ్డారు. మార్చి 26న తెల్లవారుజామున మార్కాపురం మండలం రాయవరం సమీపంలో హరికృష్ణ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వస్తున్న టిప్పర్ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సు తెలంగాణలోని జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా కలిగిరి వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
హైదరాబాద్లో శ్రావణి ట్రావెల్స్ నడుపుతున్న యార్లగడ్డ కోటేశ్వరరావు వద్ద AR 20 D 0487 నంబర్ బస్సును సెకండ్ హ్యాండ్గా కొనుగోలు చేసి హరికృష్ణారెడ్డి నడుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం సమయంలో బస్సులో సుమారు 35 నుంచి 41 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యం, బస్సు యాంత్రిక లోపాలు కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ యువరాజు, యజమాని హరికృష్ణారెడ్డి పరారీలో ఉండగా.. పోలీసులు వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన 28 మంది ప్రయాణికులు మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ