
అమరావతి, 01 ఏప్రిల్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్ ఎంపీలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి జీవన్మరణ సమస్య అయిన ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనలో ఎంపీలు పూర్తిగా విఫలమయ్యారని, వారు ప్రధాని మోదీ చేతిలో కీలుబొమ్మలుగా, బీజేపీకి బానిసలుగా మారారని ఆమె తీవ్రంగా ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలి, స్వలాభం కోసం పనిచేస్తున్న ఎంపీలంతా తమ పదవులకు తక్షణమే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
ఇవాళ లోక్ సభలో అమరావతి చట్టబద్ధత బిల్లును కేంద్రం ప్రవేశపెట్టడం తెలిసిందే. దీనిపై జరిగిన చర్చలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణికం ఠాగూర్ ప్రసంగించారు. ఈ నేపథ్యంలోనే, తెలుగు ఎంపీలపై షర్మిల విరుచుకుపడ్డారు. ఈ మేరకు సోషల్ మీడియాలో స్పందించారు.
పార్లమెంట్ వేదికగా ఏపీ విభజన హామీల గురించి గళం విప్పిన మాణికం ఠాగూర్కు రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. అయితే, ఆయన మాట్లాడుతున్నప్పుడు రాష్ట్రం నుంచి గెలిచిన ఒక్క ఎంపీ కూడా మద్దతుగా నిలబడకపోవడం తెలుగుగడ్డ చేసుకున్న దౌర్భాగ్యమని మండిపడ్డారు. మన ఎంపీలకు స్వలాభం మిన్న, రాష్ట్ర ప్రయోజనాలు సున్నా. పేరుకు మాత్రమే వేర్వేరు పార్టీల ఎంపీలు, కానీ అందరూ మోదీకి భజనపరులే. బీజేపీ బిల్లులకు గొర్రెల్లా తలలూపడం తప్ప, 11 ఏళ్లు గడుస్తున్నా హోదా ఏమైందని అడిగే దమ్ము ఒక్కరికీ లేదు అని షర్మిల ధ్వజమెత్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi