తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు తీపికబురు.. DA పెంపుపై మంత్రి పొన్నం కీలక ప్రకటన
టీజీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు 2.1 శాతం డీఏ పెంపు
మంత్రి పొన్నం


హైదరాబాద్, 10 ఏప్రిల్ (హి.స.)

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సంస్థలో పని చేస్తున్న వేలాది మంది కార్మికులు, ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని 2.1 శాతం డీఏ (డియర్నెస్ అలవెన్స్) పెంచుతున్నట్లుగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయంతో ఆర్టీసీలో పెండింగ్లో ఉన్న డీఏల ప్రక్రియ పూర్తిగా క్లియర్ అయినట్లయింది. ఈ మేరకు 2.1 శాతం గ్రోత్తో ప్రస్తుతం డీఏ 50.7 శాతం ఉండగా.. 52.8 శాతానికి పెగరనుంది. పెంచిన డీఏ ఈ క్యాలెండర్ సంవత్సరం నుంచి వర్తించనుంది. ఇక గడిచిన మూడు నెలల బకాయిలను రాబోయే 3 నెలల్లో ఒక్కో నెల సప్లిమెంటరీ బిల్లుల ద్వారా ప్రభుత్వం చెల్లించనుంది.

తాజా డీఏ పెంపు వల్ల ఆర్టీసీపై ప్రతి నెలా రూ.2.82 కోట్ల అదనపు భారం పడనుంది. గతంలో జూలై 2025లో ప్రభుత్వం 2.1 శాతం డీఏను పెంచి 48.6 శాతం నుంచి 50.7 శాతానికి చేర్చిన విషయం తెలిసిందే. మే 2024లో RPS-2017 అమలు చేసిన తర్వాత, తాజా నిర్ణయంతో ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏ బకాయిలేవీ పెండింగ్లో లేవని మంత్రి స్పష్టం చేశారు. ఆర్టీసీ రీజినల్ మేనేజర్లతో (RM) నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజా పాలనలో ఆర్టీసీ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమమే తమ మొదటి ప్రాధాన్యత అని అన్నారు. కారుణ్య నియామకాలు, తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవడం, కొత్త బస్సుల కొనుగోలు వంటి అనేక కార్యక్రమాలతో సంస్థను బలోపేతం చేస్తున్నామని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande