జూన్ 26 నుంచి గోదావరి పుష్కరాలు: మంత్రి ఆనం
గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అన్ని శాఖల అధికారులకు ఆదేశించారని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు.
Anam


రాజమండ్రి, 12 ఏప్రిల్ (హి.స.)వచ్చే ఏడాది జూన్ 26వ తేదీ నుంచి జరగనున్న గోదావరి పుష్కరాలకు పలు దేవాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. అన్ని దేవాలయాలను పున: నిర్మాణం చేస్తున్నామని పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలు నిర్వహించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు చాలా అనుభవం ఉందని తెలిపారు. సీఎంగా చంద్రబాబు ఇప్పటికే రెండుసార్లు గోదావరి పుష్కరాలు నిర్వహించగా మూడోసారి వచ్చే ఏడాది జరగనున్న పుష్కరాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని ప్రస్తావించారు. ఈరోజు(ఆదివారం) రాజమండ్రిలో పర్యటించి, పలు కార్యక్రమాల్లో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అన్ని శాఖల అధికారులకు ఆదేశించారని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఇప్పటికే మూడు సమీక్ష సమావేశాలు జరిగాయని తెలిపారు. ఈరోజు గోదావరి పుష్కరాలకు సంబంధించి రాజమండ్రిలో రూ.9.55 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేశామని వివరించారు. రాజమండ్రితోపాటు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని దేవాలయాలను గోదావరి పుష్కరాలకు అభివృద్ధి చేస్తామని అన్నారు. ఇప్పటికే 43 దేవాలయాల పున: నిర్మాణం కోసం రూ.51 కోట్ల నిధులు మంజూరు చేశామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 23 నెలల పాలనలో దేవాదాయ ధర్మాదాయ శాఖకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిందని వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లాలో ధూప, దీప, నైవేద్యాలను 162 దేవాలయాల్లో అమలు చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande