బీసీ బిడ్డ మంత్రి అయితే ఓరుస్తలేవా.. డీకే అరుణపై మంత్రి వాకిటి ఫైర్
డీకే అరుణపై మండిపడ్డ వాకాటి శ్రీహరి
మంత్రి వాకిటి


హైదరాబాద్, 11 ఏప్రిల్ (హి.స.)

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమృత్ 2.0 పథకం నిధులతో అమరచింత పెద్ద చెరువు సుందరీకరణ పనులకు సంబంధించి ప్రోటోకాల్ వివాదం సవాళ్లు, ప్రతి సవాళ్లకు దారితీసింది. ఈ క్రమంలోనే మక్తల్ అభివృద్ధికి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో, రాష్ట్రం ఏమిచ్చిందో చర్చకు రావాలని డీకే అరుణ , మంత్రి వాకిటి శ్రీహరి కి సవాలు విసిరారు. ఈ సందర్భంగా డీకే అరుణ వ్యాఖ్యలకు మంత్రి వాకిటి స్పందించారు. ఇవాళ ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. డీకే అరుణ రౌడీయిజం గురించి పాలమూరు జిల్లాలో ఎవరిని అడిగినా చెబుతారంటూ సెటైర్లు వేశారు.

తాను డీకే అరుణ విసిరిన సవాలును స్వీకరిస్తున్నానని ఆయన అన్నారు. మక్తల్ అభివృద్ధికి నిధుల కేటాయింపుపై చర్చకు సిద్ధమని ప్రతి సవాలు విసిరారు. ఇప్పటికే ప్రారంభించిన కార్యక్రమానికే మళ్లీ శంకుస్థాపన చేయడానికి ప్రయత్నిస్తే అడ్డుకున్నారని అన్నారు. తాను మొదటి నుంచి ఒకే పార్టీలో ఎదిగానని, ప్రోటోకాల్ గురించి తెలుసని పేర్కొన్నారు. ఒక బీసీ బిడ్డ మంత్రి అయితే డీకే అరుణ ఓర్వలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. తనకు మహిళల పట్ల గౌరవం ఉందని, తాను డీకే అరుణను అవమానించలేదని మంత్రి వాకిటి శ్రీహరి క్లారిటీ ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande