
హైదరాబాద్, 12 ఏప్రిల్ (హి.స.)
వచ్చే నెలలో లిక్కర్ ధరలు పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. అందుకోసం కావాల్సిన కసరత్తును మొదలుపెట్టింది. ధరలను నిర్ధారించేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీని సైతం ఏర్పాటు చేసింది. అందులో ఒక రిటైర్డ్ జడ్జి, ఒక రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్, ఒక ఆడిటర్ ఉన్నారు. ఈ కమిటీ మద్యం ఉత్పత్తిదారుల ప్రతిపాదనలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఈ ప్రక్రియ మొత్తం ఈ నెల చివర ముగియనుంది. వచ్చేనెలలో కొత్త మద్యం ధరలు అమలులోకి వస్తాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
రాష్ట్రంలో ప్రతి రెండేళ్లకూ ఒకసారి లిక్కర్ ధరలను సమీక్షించడం ఆనవాయితీ. బీఆర్ఎస్ హయాంలో 2023 మే నెలలో లిక్కర్ ధరలను పెంచారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గతేడాది 2025 మేలో లిక్కర్ రేట్లను సవరించాలని కంపెనీలు ఒత్తిడి చేశాయి. కానీ ప్రభుత్వం కొంత కాలం వరకు ఓపిక పట్టాలని చెప్పడంతో ఆ ప్రయత్నాలకు ఫుల్ స్టాప్ పడింది. కొన్ని రోజులుగా మద్యం ఉత్పత్తి కంపెనీలు రేట్లను సమీక్షించాలని కోరడంతో ప్రభుత్వం ధరల నిర్ధారణకు కమిటీని నియమించింది. ముగ్గురు సభ్యులతో కూడిన ఆ కమిటీ వచ్చేవారంలో తొలి సమావేశం నిర్వహించి, కంపెనీల ప్రపోజల్స్ను పరిశీలించనున్నట్లు తెలిసింది. ఈనెల చివరన కమిటీ తన పూర్తిస్థాయి నివేదిక అందిస్తుందని, వచ్చే నెలలో కొత్త మద్యం ధరలు అమలవుతాయని ఎక్సయిజ్ శాఖ వర్గాల్లో డిస్కషన్ జరుగుతున్నది.
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ ప్రభావం లిక్కర్ కంపెనీలపై పడింది. దీంతో మద్యం సీసాల తయారీ ఖర్చు పెరిగిందని నిపుణులు అంటున్నారు. గ్యాస్ కొరత కారణంగా సీసాల తయారీ పరిశ్రమలు రేట్లను పెంచాయి. ఆ ప్రభావం మద్యం తయారీదారులపై పడటం వల్ల లిక్కర్ రేట్లను సవరించాలని కోరుతున్నాయి.
అదనపు ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సైతం మద్యం ధరలను పెంచేందుకు సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిసింది. .
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..