
అమరావతి, 15 ఏప్రిల్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెకు పర్యటించనున్నారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను సందర్శించడంతో పాటు అక్కడి మత్స్యకారులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొననున్నారు. ఈ పర్యటనకు రాజకీయంగా, స్థానికంగా ప్రాధాన్యం ఏర్పడింది. మాజీ సీఎం జగన్ ఉదయం 8.45 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరనున్నారు. అనంతరం ఉదయం 9 గంటలకు హెలికాప్టర్ ద్వారా జువ్వలదిన్నెకు చేరుకునేందుకు ప్రయాణం ప్రారంభించనున్నారు. ఉదయం 10.25 గంటలకు జువ్వలదిన్నె హెలిప్యాడ్కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్కు వెళ్లి ఉదయం 10.25 గంటల నుంచి 10.55 గంటల వరకు హార్బర్ను సందర్శించనున్నారు.
ఇక, మత్స్యకారుల సమస్యలు, హార్బర్ అభివృద్ధి, వసతులపై అక్కడే వైఎస్ జగన్ సమీక్షించే అవకాశం ఉందని సమాచారం. అనంతరం ఉదయం 11.05 గంటల నుంచి మధ్యాహ్నం 12.05 గంటల వరకు మత్స్యకారులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా వారి సమస్యలు, వేటకు సంబంధించిన ఇబ్బందులు, ప్రభుత్వ సహాయంపై చర్చించే అవకాశం ఉంది. మధ్యాహ్నం 12.25 గంటలకు జువ్వలదిన్నె నుంచి బెంగళూరుకు బయలుదేరనున్న వైఎస్ జగన్, మధ్యాహ్నం 2.40 గంటలకు బెంగళూరులోని తన నివాసానికి చేరుకోనున్నారు. మాజీ సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో జువ్వలదిన్నెలో పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశముంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ