
మెదక్, 15 ఏప్రిల్ (హి.స.)
సోలార్ అంగన్వాడీల దిశగా అడుగులు వేయాలని ప్రతి అంగన్వాడి కేంద్రం వద్ద సోలార్ ప్లేట్లు అమర్చాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు సూచించారు. బుధవారం నర్సాపూర్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ చిన్నారులకు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు తో పాటు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీ రాజు యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. యుద్ధం నీతి సూత్రాలను నేర్పించిందని, స్వయం ఉత్పత్తిపై దృష్టి సారించాలని సూచించారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో సోలార్ ప్లేట్లను అమర్చుకొని విద్యుత్ ను ఉత్పత్తి చేయాలని ఐసీడీఎస్ అధికారులకు సూచించారు. ఆకుకూరలను కేవలం అంగన్వాడీ కేంద్రాలలోనే పెంచడం కాకుండా ప్రతి అంగన్వాడీ కార్యకర్త వారి ఇండ్లలో పెంచి ఆచరణలో పెట్టాలన్నారు. గౌతమ బుద్ధుడు చెప్పినట్లుగా బోధనలు చేయడం కాదు ఆచరణలో పెట్టాలి అనే విధంగా అంగన్వాడీ టీచర్లు ఆచరించాలన్నారు. పాతకాలపు ఆకుకూరలు మార్కెట్లలో అంతరించిపోయాయని, పునరుద్ధరించాలని సూచించారు. సోలార్ విద్యుత్ తో ఇండక్షన్ స్టవ్ లను వాడడం మూలంగా గ్యాస్ సమస్య తీరుగుతుందన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీరాజు యాదవ్ కోరిక మేరకు నర్సాపూర్ పట్టణంలో మూడు అంగన్వాడీ భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..