
శ్రీకాకుళం,15 ఏప్రిల్ (హి.స.)పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టాలన్నదే అన్నా క్యాంటీన్ ఉద్దేశమని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈరోజు(బుధవారం) టెక్కలిలో అన్నా క్యాంటీన్ను మంత్రి ప్రారంభించారు. అనంతరం అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు అనేక కార్యక్రమాలు తీసుకొచ్చినా.. అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం పెట్టినంత ఆనందం ఎప్పుడూ లేదన్నారు. తమిళనాడులో జయలలిత పెట్టిన క్యాంటీన్లను స్టాలిన్ కొనసాగించారని.. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం మాత్రం పేదల కడుపు కొట్టిందని విమర్శించారు.
ఎన్టీఆర్ పేరు నచ్చకపోతే మరో పేరు పెట్టి కార్యక్రమం కొనసాగించాలని అడిగామని.. కానీ జగన్ మనసు కరగలేదని మంత్రి మండిపడ్డారు. జగన్ దుర్మార్గుడు అంటూ వ్యాఖ్యానించారు. జగన్ అన్నా క్యాంటీన్లు మూసివేస్తే.. టీడీపీ నేతలు స్వచ్ఛందంగా పేదలకు అన్నం పెట్టారని గుర్తుచేశారు. ఇప్పటి వరకూ 207 అన్నా క్యాంటీన్లు మున్సిపాలిటీల్లో నడుస్తున్నాయని తెలిపారు. అదనంగా ప్రతి నియోజకవర్గంలో ఒక అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారని చెప్పారు. ప్రతి పేదవాడికి మూడు పూటలా కడుపు నిండా అన్నం పెట్టాలన్నదే కూటమి ప్రభుత్వం ఆశయమని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్