ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారత్ ఆశాకిరణం: ఐఎంఎఫ్
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారత్ ఆశాకిరణం: ఐఎంఎఫ్
డైరెక్టర్ క్రిస్టలినా జార్జివా


హైదరాబాద్, 16 ఏప్రిల్ (హి.స.)

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం, మందగిస్తున్న ప్రపంచ వృద్ధిరేటు వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ భారత ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా నిలబడుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జివా ప్రశంసించారు. బలమైన పునాదులు, విధానాల కారణంగా చాలా దేశాల కన్నా భారత్ మెరుగైన పనితీరు కనబరుస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఐఎంఎఫ్ స్ప్రింగ్ మీటింగ్స్లో భాగంగా జరిగిన మీడియా సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ రోజు భారత్ను చూడండి. ప్రపంచ సగటు వృద్ధి రేటు కంటే రెండు రెట్లకు పైగా అధిక వృద్ధితో భారత్ ముందుకు సాగుతోంది అని జార్జివా పేర్కొన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా భారత్ చేపట్టిన విధానపరమైన సంస్కరణలు, సంస్థాగత సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవడమే ఈ స్థిరత్వానికి కారణమని ఆమె వివరించారు. బలమైన స్థూల ఆర్థిక చట్రాలు ఉన్న దేశాలు బాహ్య ఒడిదొడుకులను సమర్థవంతంగా తట్టుకుని నిలబడగలవని తెలిపారు.

భారత్ సహా అనేక వర్ధమాన దేశాలు తమ విధానాలను, ముఖ్యంగా ద్రవ్య విధానాన్ని గణనీయంగా మెరుగుపరుచుకున్నాయని జార్జివా పేర్కొన్నారు. ద్రవ్య విధానంలో ఈ దేశాలు అభివృద్ధి చెందిన దేశాల కంటే మెరుగ్గా లేదా వాటికి సమానంగా ఉన్నాయి అని ఆమె కితాబునిచ్చారు. అయితే, ద్రవ్యోల్బణ విధానంలో మరిన్ని మార్పులు అవసరమని అంగీకరించారు. వర్ధమాన దేశాల ఆర్థిక స్థిరత్వం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా మరింత పటిష్ఠంగా మారిందని ఆమె అన్నారు.

అయితే, పశ్చిమాసియాలో సంఘర్షణ సుదీర్ఘకాలం కొనసాగితే అది భారత్తో సహా అన్ని ఆర్థిక వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆమె హెచ్చరించారు. ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే, ప్రపంచ వృద్ధి 2 శాతానికి పడిపోవచ్చని అంచనా వేశారు. ఇంధనాన్ని దిగుమతి చేసుకునే దేశాలపై దీని ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంటుందని, ముఖ్యంగా గల్ఫ్ నుంచి ఇంధనాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకునే ఆసియా దేశాలపై ఈ ఒత్తిడి మరింత ఎక్కువగా ఉంటుందని జార్జివా స్పష్టం చేశారు.

ఈ ముప్పులు ఉన్నప్పటికీ, బలమైన దేశీయ డిమాండ్, సంస్థాగత పటిష్ఠత, విధానపరమైన విశ్వసనీయత ఉన్న భారత్ వంటి దేశాలు తోటి దేశాల కంటే మెరుగైన పనితీరు కనబరుస్తాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి భారత్ విషయంలో ఎలాంటి తీవ్రమైన పరిణామాలు చోటుచేసుకునే అవకాశం లేదని, అయితే ఆర్థిక స్థిరత్వం అనేది నిరంతరం గమనించాల్సిన కీలక అంశమని ఆమె సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande