
ఢిల్లీ, 16 ఏప్రిల్ (హి.స.)కర్నూలు జిల్లాలోని మంత్రాలయం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి నష్టపరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది.
గురువారం తెల్లవారుజామున మంత్రాలయం మండలం చిలకలడోన సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకునేందుకు కర్ణాటకలోని చిక్మంగళూరు నుంచి యాత్రికులతో వస్తున్న బొలెరో వాహనం, ఎదురుగా వస్తున్న ట్యాంకర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. దీంతో మృతుల సంఖ్య 8కి చేరింది. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక బాలిక ఉన్నారు.
ప్రమాద సమాచారం అందిన వెంటనే క్షతగాత్రులను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, బొలెరో డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి ప్రాథమిక కారణమని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ దుర్ఘటన అత్యంత బాధాకరమని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV