
హైదరాబాద్, 17 ఏప్రిల్ (హి.స.)
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో పోలుస్తూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్లమెంట్ సాక్షిగా జరిగిన ఈ పరిణామంపై ఆయన నిప్పులు చెరిగారు. ఆనాడు విభజన బిల్లు ఆమోదం పొందినప్పుడు బీజేపీ తరపున సుష్మా స్వరాజ్, వెంకయ్య నాయుడు వంటి అగ్రనేతలు మద్దతు తెలిపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
తేజస్వి సూర్య చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలకు వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అసలు ఆనాడు బీజేపీ నేతలు తీసుకున్న నిర్ణయం తప్పని తేజస్వి భావిస్తున్నారా? అని ప్రశ్నించారు.
ఇదే క్రమంలో ప్రధాని మోదీ అనుసరిస్తున్న రాజకీయాలపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. మోదీ సర్కార్ 'నీతి లేని రాజకీయాలు' చేస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్తో ముడిపెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇది 'పాయసంలో విషం కలిపి తాగమన్నట్లుగా' ఉందని ఎద్దేవా చేశారు. మహిళా రిజర్వేషన్లు న్యాయమైనవని, వాటిని నేరుగా అమలు చేయకుండా డీలిమిటేషన్ పేరుతో కాలయాపన చేయడం మహిళలను బ్లాక్ మెయిల్ చేయడమేనని మండిపడ్డారు. ఈ డీలిమిటేషన్ ప్రక్రియ భవిష్యత్తులో దేశాన్ని ఉత్తర, దక్షిణ భాగాలుగా విభజించే ప్రమాదం ఉందన్న ఆందోళనను కూడా ఆయన వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi