
అమరావతి, 17 ఏప్రిల్ (హి.స.)ఏపీలో జనగణనలో భాగంగా కొనసాగుతున్న సెల్ఫ్ ఎన్యుమరేషన్ కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు స్వీయ లెక్కింపునకు అవకాశం కల్పించామని ఏపీ సీఎస్ జి.సాయిప్రసాద్ తెలిపారు. ఈ మేరకు సీఎస్ సర్క్యూలర్ జారీ చేశారు. https://se.census.gov.in పోర్టల్ ద్వారా ప్రజలు స్వయంగా వివరాలు నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు. ప్రజల భాగస్వామ్యం పెంచేందుకు 15 రోజుల ప్రత్యేక అవుట్రీచ్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు వివరించారు
అన్నివర్గాల ప్రజలను చేరుకునేలా థీమాటిక్ డ్రైవ్ కొనసాగుతోందని ఏపీ సీఎస్ వ్యాఖ్యానించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రభుత్వ సిబ్బంది, కార్యాలయాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రముఖులు, సినీ నటులు, క్రీడాకారులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. SHG మహిళలు, ఉపాధి హామీ కార్మికులకు ప్రత్యేక డ్రైవ్లు ఉంటాయని తెలిపారు. స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీల్లో అవగాహన కల్పిస్తామని చెప్పారు. అంగన్వాడీ, ఆరోగ్య సిబ్బంది ద్వారా ప్రచారం చేస్తామని వెల్లడించారు. గిరిజన ప్రాంతాలు, శాండీల వరకు విస్తరిస్తున్నట్లు వివరించారు. రెసిడెంట్ వేల్ఫేర్ అసోసియేషన్స్ మీటింగ్స్ ద్వారా నగరాల్లో ప్రచారం చేస్తామని పేర్కొన్నారు.
ఏప్రిల్ 26వ తేదీన “Census 5K Run” నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు. షాపులు, ఫ్యాక్టరీలు, బ్యాంకుల్లో అవగాహన కార్యక్రమాలు, పోలీస్ సిబ్బందికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రతి సెక్రటేరియట్లో రోజుకు 10 నుంచి 20 మంది స్వీయ లెక్కింపు లక్ష్యమని అన్నారు. మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయాలని ఐఅండ్పీఆర్కు ఏపీ సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. స్వీయ లెక్కింపు పూర్తిగా స్వచ్ఛందం మాత్రమేనని చెప్పుకొచ్చారు. ఎవరినీ బలవంతం చేయొద్దని.. అన్ని శాఖలు సమన్వయంతో కార్యక్రమం విజయవంతం చేయాలని ఏపీ సీఎస్ జి.సాయిప్రసాద్ సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్