
హైదరాబాద్, 17 ఏప్రిల్ (హి.స.)కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్రెడ్డికి, తమ ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశం లేదని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈనెల 20వ తేదీన సీఎం రేవంత్రెడ్డితో కలిసి మేడిగడ్డ బ్యారేజ్ను పరిశీలిస్తామని పేర్కొన్నారు. ఈరోజు (శుక్రవారం) ఢిల్లీ వేదికగా మీడియాతో మంత్రి ఉత్తమ్ మాట్లాడారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్తో కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులు, పునరుద్ధరణపై చర్చించామని తెలిపారు.
గోదావరి వరదలు వచ్చేలోగా సాయిల్ టెస్టింగ్, డిజైన్లు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంపై కేసీఆర్ హయాంలో చేసిన పొరపాటు తెలంగాణ ప్రజలకు తెలుసునని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరాన్ని నిర్మించారని, అది కూలిపోయిందని అన్నారు. కాళేశ్వరంపై దాదాపు రూ.97 వేల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసి ఆ ప్రాజెక్టు నిర్మించారని తెలిపారు.
కాళేశ్వరంపై ప్రతి ఏడాది రూ.10వేల కోట్ల వడ్డీ కడుతున్నామని తెలిపారు. ప్రజాధనం ఉపయోగించడంతోనే దాన్ని ఎలా రిపేర్ చేయాలో ఆలోచించి ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు అన్నీ విషయాలు గమనిస్తున్నారని అన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మార్గదర్శకాలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నామని చెప్పుకొచ్చారు. మేడిగడ్డ డ్యామేజ్ సాయిల్ టెస్ట్, డిజైన్ల ఖర్చులను కాంట్రాక్ట్ సంస్థలే భరిస్తాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్