
నరసాపురం, 17 ఏప్రిల్ (హి.స.)పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ చర్చి పాస్టర్ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు బయటపడటం కలకలం రేపింది. నరసాపురం మండలం పీచుపాలెంకు చెందిన పాస్టర్ ఘంటా జాన్బాబూరావు నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించి, ఎలాంటి ఆధారాలు లేని రూ. 2.27 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ డబ్బును సీజ్ చేసి, ఆదాయపు పన్ను (ఐటీ) శాఖకు సమాచారం అందించారు.
ఇటీవల పాస్టర్ అల్లుడు శాంసన్ హైదరాబాద్ నుంచి రూ. 50 లక్షల నగదు తీసుకురావడంతో పోలీసులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన మామగారైన జాన్బాబూరావు ఇంట్లో తనిఖీలు చేపట్టగా, రూ. 500 నోట్ల కట్టల రూపంలో దాచి ఉంచిన ఈ భారీ మొత్తం బయటపడింది. ఇది హవాలా లావాదేవీలకు సంబంధించిన డబ్బు అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఒక పాస్టర్ ఇంట్లో ఇంత పెద్ద మొత్తంలో నగదు దొరకడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాలంలో బాబూరావు కుటుంబం పెద్ద ఎత్తున ఆస్తులు కొనుగోలు చేసినట్లు, లక్షల్లో ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పట్టుబడిన డబ్బు గురించి పోలీసులు ప్రశ్నించగా, కుటుంబ సభ్యులు పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ డబ్బు మూలాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi