థాయ్లాండ్ నీళ్ల పండుగలో నెత్తుటి మరకలు.. 191 మంది మృతి
థాయ్లాండ్ నీళ్ల పండుగలో నెత్తుటి మరకలు.. 191 మంది మృతి
థాయ్లాండ్ నీళ్ల పండుగలో నెత్తుటి మరకలు.. 191 మంది మృతి


థాయిలాండ్, 17 ఏప్రిల్ (హి.స.)

ప్రపంచంలోనే అతిపెద్ద వాటర్ ఫైట్గా ప్రసిద్ధి చెందిన థాయ్లాండ్ నూతన సంవత్సర వేడుక 'సోంగ్క్రాన్' ఈసారి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పంట కోతల అనంతరం ఏప్రిల్ మధ్యలో జరుపుకునే ఈ పండుగ సంతోషం బదులు ఆందోళన నింపింది. వారం రోజులుగా జరుగుతున్న వేడుకల్లో ఇప్పటివరకు 191 మంది మరణించగా, 951కి పైగా రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు.

ప్రతి ఏటా సోంగ్క్రాన్ సందర్భంగా బ్యాంకాక్ వంటి ప్రధాన నగరాల్లోని లక్షలాది మంది ప్రజలు తమ సొంత గ్రామాలకు కుటుంబసభ్యులతో కలిసి వేడుకలు జరుపుకోవడానికి వెళతారు. ఈ క్రమంలో భారీగా పెరిగే ట్రాఫిక్ కారణంగా ప్రమాదాలు అధికంగా జరుగుతుంటాయి. ఈ ఏడు రోజుల కాలాన్ని ఏడు ప్రమాదకరమైన రోజులుగా స్థానికులు పిలుస్తారు.

న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం ఈ ప్రమాదాల్లో 42 శాతం అతివేగం వల్ల జరగగా, 27.4 శాతం మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల సంభవించాయి. హెల్మెట్లు ధరించకపోవడం వంటి నిర్లక్ష్యపూరిత ప్రవర్తనలు కూడా మరణాలకు కారణమవుతున్నాయి. డిజాస్టర్ ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ విభాగం డేటా ప్రకారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నట్టు తేలింది.

ప్రభుత్వం ఏటా భద్రతా ప్రచార కార్యక్రమాలు, కఠినమైన చట్టాలు అమలు చేస్తున్నప్పటికీ, ఈ మారణహోమం ఆగడం లేదు. అయితే, ఈ వేడుకల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ ఆదాయం సమకూరుతుంది. ఈ ఏడాది సుమారు 5 లక్షల మంది అంతర్జాతీయ పర్యాటకులు వస్తారని, దీని ద్వారా ప్రభుత్వానికి దాదాపు 940 మిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని అంచనా.

సోంగ్క్రాన్ అనే పదం సంస్కృతంలోని 'సంక్రాంతి' నుంచి వచ్చింది. సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించడాన్ని ఇది సూచిస్తుంది. భారతదేశంలో జరుపుకునే మకర సంక్రాంతికి, ఈ పండుగకు మూలాలు ఒకటే. గతేడాది పాపాలను కడిగివేసి కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి నీటిని వాడటం ఇక్కడి ప్రధాన సంప్రదాయం. ఇంతటి సాంస్కృతిక ప్రాధాన్యం ఉన్న పండుగ ఏటా వందల మందిని బలి తీసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande