తిరుమల లడ్డూ నాణ్యతపై ఎగ్జామ్లో ప్రశ్న.. షాకైన విద్యార్థులు, విపక్షాల ఆగ్రహం
తిరుమల లడ్డూ నాణ్యతపై ఎగ్జామ్లో ప్రశ్న.. షాకైన విద్యార్థులు, విపక్షాల ఆగ్రహం
తిరుమల


తిరుమల, 17 ఏప్రిల్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ రాజకీయ రంగు పులుముకుందా అంటే ఔననే సమాధానమే వస్తుంది. తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న వార్షిక పరీక్షల ప్రశ్నాపత్రంలో వివాదాస్పదమైన ‘తిరుమల లడ్డూ కల్తీ’ (Adulteration of Tirumala Laddus) అంశాన్ని చేర్చడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన ఓ సబ్జెక్ట్ పరీక్షలో ‘ఇటీవల తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడిన నెయ్యి నాణ్యత, కల్తీ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది కదా.. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?’ అనే అర్థం వచ్చేలా ప్రశ్నను రూపొందించారు. కేవలం అకడమిక్ పాఠాలకే పరిమితం కావాల్సిన ప్రశ్నాపత్రంలో ఈ అంశం కనిపించడంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు.

పరీక్ష ముగిసిన తర్వాత విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ఈ విషయాన్ని తెలపడంతో వారు విద్యాశాఖ తీరుపై మండిపడుతున్నారు. పిల్లలకు గణితం, సైన్స్ నేర్పించాల్సింది పోయి.. రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలను పరీక్షల్లో అడగడం ఏంటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇది చిన్నారుల మనసుల్లో ఒక పార్టీ పట్ల సానుకూలత లేదా మరొకరి పట్ల వ్యతిరేకత పెంచే ప్రయత్నంగా వారు భావిస్తున్నారు. ఈ అంశంపై ప్రధాన విపక్షాలు సోషల్ మీడియా (Social Media) వేదికగా విరుచుకుపడుతున్నాయి. ప్రభుత్వాలు తమ ప్రచార సాధనాలుగా పాఠశాలలను వాడుకోవడం దారుణమని విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ప్రశ్నాపత్రానికి సంబంధించి ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande