
అమరావతి, 02 ఏప్రిల్ (హి.స.)
అనంతపురం నగర శివారులో బుధవారం ఏసీబీ అధికారులు శ్రీసత్యసాయి జిల్లా గుడిబండ మండలం తహసీల్దార్ కునకుంట్ల శ్రీధర్ నివాసంలో నిర్వహించిన తనిఖీల్లో పెద్ద ఎత్తున నగదు, విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. సదరు తహసీˆల్దార్ను మంగళవారం తన కార్యాలయంలోనే ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. సోదాలకు కొనసాగింపుగా అనంతపురం రూరల్ మండలం ఉప్పరపల్లి గ్రామంలోని అతని ఇంట్లో అధికారులు విస్తృతంగా తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీల్లో రూ.55 లక్షల నగదు, 221 గ్రాముల బంగారు నగలు, 685 గ్రాముల వెండి ఆభరణాలు బయటపడ్డాయి. జీ ప్లస్ టూ ఇంటికి సంబంధించిన ఆస్తి పత్రాలు, రూ.24 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించిన పత్రాలు, విలువైన గృహోపకరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కర్నూలు లోని ఏసీబీ కోర్టు ఎదుట హాజరు పరిచారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ