అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత (update)
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత (update)


అమరావతి, 27 ఏప్రిల్ (హి.స.)

అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మల్లిక అనే హిజ్రా రైల్వే గేట్ పట్టాలపై శవమై కనిపించడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఇది ముమ్మాటికీ హత్యేనని తోటి హిజ్రాలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడిపత్రి పట్టణానికి చెందిన మల్లిక అనే హిజ్రా నిన్న(ఆదివారం) సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. ప్రత్యర్థి వర్గానికి చెందిన కొందరు హిజ్రాలు ఆమెను ఆటోలో బలవంతంగా తీసుకువెళ్లినట్లు సమాచారం. మల్లికను ఆటోలో తీసుకువెళ్తున్న దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియో ఆధారాలు ఇప్పుడు కేసు విచారణలో అత్యంత కీలకంగా మారాయి. ఈ ఫుటేజీ ఆధారంగానే పోలీసులు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. ఆదివారం రాత్రి చల్లవారిపల్లి రైల్వేగేట్ సమీపంలోని పట్టాలపై ఓ మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అది మల్లిక మృతదేహంగా గుర్తించారు. మల్లిక మరణ వార్త తెలియడంతో తోటి హిజ్రాలు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. మల్లికను పక్కా పథకం ప్రకారం కిడ్నాప్ చేసి, ప్రత్యర్థి గ్రూపునకు చెందినవారే దారుణంగా హతమార్చారని వారు ఆరోపిస్తున్నారు.

పోలీసుల చర్యలు.. ముగ్గురు హిజ్రాల అరెస్ట్

ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు రంగంలోకి దిగి విచారణ వేగవంతం చేశారు. మల్లిక మృతికి సంబంధించి అనుమానితులుగా భావిస్తున్న శిరీష, సంగీత, రాధ అనే ముగ్గురు హిజ్రాలును అదుపులోకి తీసుకుని, విచారణ చేపట్టారు. హిజ్రా వర్గాల మధ్య ఉన్న గ్రూపు తగాదాలే ఈ హత్యకు దారితీశాయా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాడిపత్రిలో హిజ్రాల మధ్య తలెత్తిన ఈ ఘర్షణ మరణానికి దారితీయడం చర్చనీయాంశంగా మారింది. మల్లిక మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె అనుచరులు డిమాండ్ చేస్తున్నారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande