జలవనరుల సంరక్షణకు యాక్షన్ ప్లాన్
జలవనరులను సంరక్షించడానికి 100 రోజుల యాక్షన్ ప్లాన్ నుసీఎం చంద్రబాబు సిద్ధం చేశారు
జలవనరుల సంరక్షణకు యాక్షన్ ప్లాన్


తెలంగాణ, 06 ఏప్రిల్ (హి.స.)

జలవనరుల సంరక్షణకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ను యాడికి నుంచి ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వెల్లడించారు. ఈరోజు అనంతపురం జిల్లా, తాడిపత్రి నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. 'నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత' కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రైతులు, సాగునీటి సంఘాలతో సమావేశమవుతారు.

నేటి నుంచి జులై 14వ తేదీ వరకు జలవనరుల సంరక్షణ చర్యలు ప్రభుత్వం చేపట్టనుంది. నీటి భద్రతలో ప్రజలు, రైతులను భాగస్వాములను చేసేలా రూపకల్పన చేయనున్నారు. జల సంరక్షణకు 60 వేలమంది సాగునీటి సంఘాల సభ్యుల ద్వారా చర్యలు చేపట్టనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్నమయ్య జిల్లాలో ప్రభుత్వం ఉత్తమ ఫలితాలను రాబట్టింది.

భూగర్భ జలమట్టాలను పెంచేందుకు మిషన్ మోడ్లో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. వేసవిలో 6 మీటర్లు, వర్షాకాలం తర్వాత 3 మీటర్ల మేర భూగర్భ జలాలు ఉండేలా కార్యాచరణ చేపట్టారు. సమగ్ర నీటి వినియోగంతో పాటు వీలైనంత ఎక్కువ వర్షపు నీటిని ఒడిసిపట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. భవిష్యత్తులో నీటి అవసరాలు పెరగనున్న నేపథ్యంలో ముందుగానే ప్రభుత్వం సిద్ధమవుతోంది. నీటి వనరులను రియల్ టైమ్లో మానిటరింగ్ చేసేందుకు ఇప్పటికే అవేర్ 2.0ను ప్రభుత్వం తీసుకువచ్చింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande