కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్.. ముగ్గురు మృతి
కామారెడ్డి రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు
Road accident


కామారెడ్డి, 08 ఏప్రిల్ (హి.స.)

ఆగి ఉన్న లారీని బైకు ఢీ కొనడంతో బైకుపై ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనుర్ గ్రామ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా విషాధాన్ని మిగిల్చింది. పెద్ద ఎక్లరా గ్రామానికి చెందిన నాగు (48), సతీష్ (17), జుక్కల్ మండలం నాగల్గావ్ గ్రామానికి చెందిన అశోక్ (24) మద్నూర్ మండల కేంద్రంలో కూలీ పనులు ముగించుకుని ఒకే బైక్పై ఇంటికి బయలుదేరారు. జాతీయ రహదారి 161 మెనుర్ సమీపంలోని లచ్చన్ గేట్ ప్రధాన రహదారిపై ఆపి ఉన్న లారీని ఢీకొట్టడంతో దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాద తీవ్రతకు సతీష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన నాగు, అశోక్ ను స్థానికులు బాన్సువాడ ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలోనే మృతి చెందారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు నాగు, సతీష్ ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande