హైదరాబాదు ఏబీ ఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం పై వైసిపి దాడి
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడి యత్నాన్ని ఏపీ సీఎం ఖండించారు
హైదరాబాదు ఏబీ ఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం పై వైసిపి దాడి


అమరావతి, 07 ఏప్రిల్ (హి.స.) హైదరాబాద్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడి యత్నాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నేతలు, రౌడీలు దాడికి దిగడం మీడియా స్వేచ్ఛపై దాడిగా సీఎం అభివర్ణించారు. సొంతంగా మీడియా సంస్థలను నడుపుతూ.. మీడియాను అడ్డుపెట్టుకుని అనైతిక చర్యలకు పాల్పడుతోన్న వైసీపీ.. తమను ప్రశ్నించిన ఆంధ్రజ్యోతిపై ఆరోపణలు, దూషణలు చేయడం అసంబద్ధం అన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో మీడియా సంస్థలపై, ఆంధ్రజ్యోతిపై అనేక వేధింపులకు, కుట్రలకు పాల్పడినా నిబ్బరంగా నిలిచాయి తప్ప భయపడలేదని చంద్రబాబు గుర్తుచేశారు.

రౌడీ మూకలను వెంటేసుకుని స్వయంగా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు మీడియా కార్యాలయంపైకి వెళ్లడం వైసీపీ రౌడీ సంస్కృతికి నిదర్శనమని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ దశాబ్దాలుగా కేసులు, దాడులు, ఒత్తిళ్లకు భయపడకుండా పత్రికను, ఛానల్ను నడుపుతున్నారన్నారు. దాడులు, నిరసనలు, బెదిరింపులతో మీడియాను భయపెట్టాలనే వైసీపీ రాజకీయాలకు కాలం చెల్లిందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాజధానిపై వైసీపీ కుట్రలను ప్రశ్నించిన ఆంధ్రజ్యోతి సంపాదకీయానికి సమాధానం చెప్పలేక.. దాడులు నిరసనలతో వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతోందని సీఎం చంద్రబాబు దుయ్యబట్టారు.

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande