
చింతపల్లి, 30 మే (హి.స.)
చింతపల్లి, మన్యంలో విద్యుత్తు ప్రాజెక్టు అమలుకు అటవీ శాఖ మోకాలడ్డుతోంది. సీలేరు నుంచి చింతపల్లి వరకు 33 కేవీ లైను ఏర్పాటుకు ప్రభుత్వం ఏడాదిన్నర కింద పచ్చజెండా ఊపింది. ఇందుకోసం రూ.3 కోట్లు మంజూరు చేసింది. ప్రాజెక్టుకు సంబంధించి సర్వేలన్నీ పూర్తయ్యాయి. అటవీ శాఖ నుంచి అనుమతులు రాకపోవడంతో ఈ ప్రాజెక్టు ముందుకు కదలడం లేదు.
అల్లూరి మన్యంలో ఇప్పటికీ విద్యుత్తు సదుపాయం లేని గ్రామాలున్నాయి. ఉన్నచోట్ల తరచూ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. ఇటీవల ఈదురు గాలులతో కురిసిన వర్షాలకు చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల్లో అంధకారం అలుముకుంది. సిబ్బంది సమస్యను గుర్తించి సరఫరాను పునరుద్ధరించేందుకు ఒకటి, రెండు రోజులు పడుతుంది. అప్పటివరకు గిరిజన పల్లెలు చీకట్లో ఉండిపోవాల్సిందే.
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ