
నల్గొండ, 21 జూన్ (హి.స.)
ఎన్నికల్లో పెరిగిపోతున్న ఖర్చుల కోసమే విపరీతమైన స్కాములు జరుగుతున్నాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండలో ఆదివారం మీడియాతో ఆయన చిట్ చాట్ నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు హయాం నుంచి విపరీతమైన ఎన్నికల ఖర్చులు పెరిగాయని అన్నారు. ఎన్నికల ఖర్చులు తగ్గించేందుకు పార్లమెంట్ స్థాయిలో పకడ్బందీగా చట్టాలు చేయాలని సూచించారు. పరిపాలన వ్యవస్థలో కూడా కంట్రోల్ లేకుండా పోయిందని, అధికారులపై ప్రభుత్వానికి ఆజమాయిషి ఉందా లేదా అనే సందేహం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ధరణిలో అవినీతి జరిగిందని అనుకుంటే భూభారతి వచ్చాక కూడా అవినీతి మరింత విచ్చలవిడిగా పెరిగిపోయింది అన్నారు. ఏసీబీ దాడులు ఎన్ని జరిగినా అధికారులలో మార్పులు రావడం లేదని, కఠిన చట్టాలు తీసుకొచ్చి అవినీతి అధికారులను పని పట్టాలన్నారు.
ఏసీబీ దాడుల్లో దొరికిన ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సూచించారు. ఉచిత పథకాల కారణంగా కూలీలు దొరకడం లేదని అన్నారు. ఈ మధ్య ప్రభుత్వ రిటైర్మెంట్ ఉద్యోగులను తిరిగి నియామకం చేయడాని ఆయన తప్పుపట్టారు. అలాంటి వాళ్లను నియమిస్తే అవినీతికి ఆస్కారం పెరుగుతుందని పేర్కొన్నారు. ఈఎన్సీ స్థాయి నుంచి కింది స్థాయి వరకు కోట్ల రూపాయల అవినీతి బయట పడుతున్న విషయం అందరూ చూస్తూనే ఉన్నామని తెలిపారు. గతంలో ఉన్న పటేల్ పట్వారీ వ్యవస్థలే కాస్త నయంగా ఉన్నాయని, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఐఏఎస్ ఐఆర్ఎస్ ఉద్యోగులు కూడా ప్రజాప్రతినిధులుగా మారుతున్నారని పేర్కొన్నారు. దీంతోపాటు మారుతున్నారని పేర్కొన్నారు. దీంతోపాటు మతోన్మాదులు కూడా రాజకీయాల్లోకి వస్తున్నారని అన్నారు
రాజకీయాల్లో తనతో పాటు ఎవరు శుద్ధపూసలు కాదని, 99 శాతం మంది అవినీతిపరులేనని పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో డబ్బులు ఇవ్వకపోతే ఓట్లు వేయమని ఓటర్లు ధర్నాకు దిగిన సంగతి గుర్తు చేశారు. కాకుండా చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల్లో ఓటుకు రూ.12000 ఇచ్చి కొనుగోలు చేసిన సంగతి బహిరంగ రహస్యమే అన్నారు. రాజకీయ నాయకుల అవినీతిని ఆదర్శంగా తీసుకొని ఉద్యోగులు కూడా వందల కోట్లు కిలోల కొద్ది బంగారం దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఉచితాలు ఇవ్వడం కుదరదని ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రభుత్వాలను సూచించారు ఉచిత పథకాల కారణంగా అభివృద్ధి పనులు చేసేందుకు డబ్బులు ఉండట్లేదు అని గుర్తు చేశారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..