
అమరావతి, 22 జూన్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ బదిలీకి కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. యువజన, అభ్యుదయ, పర్యాటక & సాంస్కృతిక శాఖ పరిధి నుంచి సైన్స్, టెక్నాలజీ & ఇన్నోవేషన్ శాఖకు అకాడమీని బదిలీ చేసింది. అకాడమీ సమర్థవంతమైన నిర్వహణ, మెరుగైన సమన్వయమే లక్ష్యంగా ఈ నిర్ణయాన్ని సీఎం చంద్రబాబు సర్కార్ తీసుకుంది. ఈ మేరకు జీవో ఎంఎస్ నంబర్ 73ని జారీ చేసింది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నియమావళి-2018 రెండో షెడ్యూల్లో సవరణలు చేసింది.
తదుపరి అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖలకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. తాజా ఆదేశాలతో పరిశోధన, ఆవిష్కరణలకు సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ మరింత ఊతమివ్వనుంది. శాఖల మధ్య సమన్వయం పెంపుతో అకాడమీ పని తీరు మెరుగుపడుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పరిపాలనా పునర్వ్యవస్థీకరణ దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాలకు ప్రాధాన్యం ఇస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ