
హైదరాబాద్, 22 జూన్ (హి.స.)
, హైదరాబాద్: నగరంలో కొన్ని రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు తగ్గినా.. ఉక్కపోత వీడటం లేదు. రాత్రికూడా అదే పరిస్థితి ఉంటోంది. అడపాదడపా వానలు పలకరిస్తున్నాయి. ఇలాంటి మిశ్రమ వాతావరణం.. ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. పిల్లల నుంచి పెద్దల వరకు జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు, తలనొప్పి తదితర సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజులుగా గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, ఫీవర్ తదితర ఆసుపత్రులకు వచ్చే రోగులసంఖ్య క్రమంగా పెరుగుతోంది. వానాకాలంలో వైరల్ జ్వరాలు సాధారణమే. కానీ కొన్ని రోజులుగా నగర వాతావరణంలో మార్పుల కారణంగా అనారోగ్యం బారిన పడే వారి సంఖ్య పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల సిబ్బందితో ఉన్నతాధికారులు సమావేశమయ్యారు.అంటువ్యాధులపై అప్రమత్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్