
హైదరాబాద్, 23 జూన్ (హి.స.)
కేంద్రం తీసుకువచ్చిన ఆధార్ యాప్
రికార్డులు సృష్టిస్తోంది. యాప్ తీసుకువచ్చిన కేవలం 5 నెలల్లోనే 3.1 కోట్ల మంది ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ ద్వారా 40 లక్షల మంది తమ మొబైల్ నంబర్ అప్డేట్ చేసుకున్నారు. అంతేకాకుండా 8.5 లక్షల మంది తమ అడ్రస్ మార్చుకున్నారు. ఐదు నెలల్లో ఈ స్థాయిలో డౌన్ లోడ్స్ పెరగటం ఆధార్ యాప్ పై ప్రజలకు నమ్మకం పెరగడాన్ని సూచిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఆధార్ యాప్ కంటే ముందు ఎం ఆధార్ యాప్ ఉండేది.
అయితే ఇందులో గోప్యతకు సంబంధించిన సమస్య ఉందనే ఫిర్యాదులు వచ్చాయి. ధృవీకరణ సమయంలో వినియోగదారుల పూర్తి సమాచారం కనిపించడంతో ఈ యాప్ పై ఫిర్యాదులు అందాయి. ఇక ప్రస్తుతం తీసుకువచ్చిన యాప్ లో అలాంటి సమస్యలు లేకపోవడంతో అనుమానం లేకుండా వినియోగిస్తున్నారు. అంతేకాకుండా గతంలో ఏదైనా అప్డేట్ చేయాలంటే ఆధార్ కేంద్రాల వద్ద క్యూలో నిలబడాల్సిన పని తప్పింది. ఇక ఇప్పటికీ కొందరు ఆధార్ అప్డేట్ ఎలా చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు.
యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలనుకునేవాళ్లు ముందుగా యాపిల్ స్టోర్ లేదా గూగుల్ ప్లే స్టోర్లో ఆధార్ యాప్ అని ఇంగ్లీష్లో టైప్ చేయాలి. తరవాత యూఐడీఏఐ విడుదల చేసిన అఫిషియల్ యాప్ పైన కనిపిస్తుంది. దానిని డౌన్ లోడ్ చేసుకోవాలి. యాప్ ఇన్ స్టాల్ అయిన తరవాత అందులో మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. అనంతరం ఓటీపీ ఎంటర్ చేసి తరవాత ఆధార్ సేవలను వినియోగించుకోవచ్చు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..